ManaEnadu:పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి కేంద్రమంత్రి రణ్వీత్ సింగ్ బిట్టూ, మధ్యప్రదేశ్ నుంచి మరో యూనియన్ మినిస్టర్ జార్జి కురియన్ను అభ్యర్థులుగా బరిలోకి దించింది.
ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా స్థానాలకు బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపింది.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఇదే..
సర్దార్ రణ్వీత్ సింగ్బిట్టూ – రాజస్థాన్
జార్జ్ కురియన్ – మధ్యప్రదేశ్
మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తెలి – అస్సాం (2)
మనన్ కుమార్ మిశ్రా – బిహార్
కిరణ్ చౌధరి – హరియాణా
ధైర్యశిల్ పాటిల్ – మహారాష్ట్ర
మమత మొహంత – ఒడిశా
రజీబ్ భట్టాచార్జీ – త్రిపుర
రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.