
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun), ఆయన మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ పై పలు ఆరోపణలు చేసిన లావణ్య చివరకు.. అంతా అయిపోయింది నా రాజ్ మంచోడు క్షమించమని కాళ్లు పట్టుకుంటానని గతంలో వ్యాఖ్యానించింది. ఇక ఈ డ్రామాకు ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. తాజాగా ఈ వివాదంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఈ గొడవలోకి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..
ఈ ఇంటిపై నాకు హక్కుంది
లావణ్య ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేటలోని ఓ విల్లాలో నివాసం ఉంటోంది. ఇది రాజ్ తరుణ్(Raj Tarun Lavanya Dispute) తో సహజీవనం చేస్తున్నప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఇల్లు. అయితే ఇది రాజ్ తరుణ్ పేరుపై ఉంది. ప్రస్తుతం లావణ్య ఈ ఇంట్లో ఉండటంతో ఆ హీరో తల్లిదండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పారు. బుధవారం రోజున కోకాపేటలోని ఆ ఇంటికి వచ్చిన హీరో తల్లిదండ్రులు లావణ్యను బయటకు వెళ్లిపోమన్నారు. కానీ ఆ ఇంటిపై తనకు హక్కు ఉందంటూ వాళ్లను బయటకు గెంటేసింది.
ఇది మా కొడుకు ఇల్లు
ఈ క్రమంలో లావణ్య ఇంటి వద్ద అర్ధరాత్రి వరకు హైడ్రామా సాగింది. తెల్లవారుజాము వరకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు (Raj Tarun Parents) ఆ ఇంటి బయటే ఉన్నారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో లావణ్య తమ కోడలు కాదని, ఈ ఇల్లు తమ కుమారుడి పేరు పై ఉందని రాజ్ తరుణ్ పేరెంట్స్ పోలీసులకు తెలిపారు. తమ కొడుకు ఇంట్లో తాముంటామని చెప్పడంతో లావణ్యకు నచ్చజెప్పి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను పోలీసులు ఇంట్లోకి పంపించడంతో డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది.