
వివాహేతర సంబంధం (Extra Marital Affair) నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది నైతికతకు సంబంధించిన అంశం అని, దాన్ని నేరంగా పరిగణించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఉదహరించడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉటంకిస్తూ.. తన భార్య ప్రియుడిపై భర్త వేసిన కేసు నుంచి.. ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17వ తేదీన విముక్తి కలిగించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
భార్య భర్త ఆస్తి కాదు
భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497వ సెక్షన్ (IPC 497 Section) ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగ బద్ధం కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు (Supreme Court Verdict) ఇచ్చిందని తెలిపింది. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమనీ, దాన్ని నేరంగా చూడకూడదని గతంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఉటంకించారు.
వివాహేతర సంబంధం నేరం కాదు
ఇక ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళ భర్త ఆరోపించాడు. వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని తన భార్య ప్రియుడిపై కేసు వేశాడు. ఈ కేసులో ప్రియుడిని మేజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టింది. అయితే ఆ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసి, ప్రియుడికి సమన్లు పంపడంతో ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు వివాహేతర సంబంధం నేరం కాదని స్పష్టం చేస్తూ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.