
ప్రభుత్వ భూములు, చెరువుల సంరక్షణకు ఏర్పాటైన హైడ్రా (Hydra) ప్రజలకు కీలక సూచనలు చేసింది. అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందిపడొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని కొని ఇబ్బందులు పడకూడదని తెలిపారు.
ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల (Farm Plots Registration)పై నిషేధం ఉన్నా కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు అందిన ఫిర్యాదుపై రంగనాథ్ స్పందించారు. ‘రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడలోని సర్వే నెంబర్ 50లో 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల (వ్యవసాయ భూముల) పేరిట లే అవుట్ వేసి అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి వీల్లేదు.’ అని కమిషనర్ (Hydra Ranganath) వెల్లడించారు.
“జీవో నెంబర్ 131 ప్రకారం అనాథరైజ్డ్ లే అవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. నగర పరిధిలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం 10 శాతం పార్కుల కోసం, 30 శాతం రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఆ నిబంధనలను పాటించడం లేదు.” అని హైడ్రాకు అందిన ఫిర్యాదుల్లో గుర్తించినట్లు రంగనాథ్ తెలిపారు.