
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా రానున్న మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడుతారని.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో వేడి వాతావరణం ఉంటుందని.. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న హైదరాబాద్ (Hyderabad Weather News) నగరానికి ఏప్రిల్ 26వ తేదీ వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్
రెండు రోజుల పాటు ఉక్కపోత (Hyderabad Heat Wave)గా ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మరోవైపు ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల సహా పలు జిల్లాల్లో 44°డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. ఉదయం 10 దాటిన తర్వాత అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఒకవేళ తప్పనిసరి అయి పగటిపూట బయటకు వెళ్తే తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
ఏపీలో ఉక్కపోత
మరోవైపు కోస్తాంధ్ర, యానాం, ఆంధ్రప్రదేశ్ (AP Heat Wave), రాయలసీమ, ఝార్ఖండ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహేలో వేడి, తేమతో ఉక్కపోత పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈనెల 27న బంగాల్ లోని కొన్ని చోట్ల, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు (IMD Rain Alert) కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాబోయే 2-3 రోజుల్లో దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.