Mana Enadu:మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు.
ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 3న దిల్లీకి వెళ్లే అవకాశముంది. గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ పాల్గొన్నారు. మళ్లీ వీరంతా పాల్గొంటారా… ముఖ్యమంత్రే అధిష్ఠానంతో చర్చించి ఖరారు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవచ్చు. ప్రస్తుతం నలుగురు ఐదుగురికి అవకాశం ఇస్తారని, మిగిలిన ఖాళీలను తర్వాత నింపుతారని తెలుస్తోంది. మంత్రులతోపాటు ఉప సభాపతి, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశముంది. మొత్తంగా ఏడెనిమిది మందికి ఈ పదవులు లభించొచ్చు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.
ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నారు. ఇదే జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారెవ్వరూ లేరు. భారాస నుంచి దానం నాగేందర్ చేరినా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు.