
కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా మంచు విష్ణు, మనోజ్ ఎక్స్ వేదికగా పరోక్షంగా ఒకరిపై మరొకరు ట్వీట్ వార్ మొదలు పెట్టారు. ఇక మనోజ్ అయితే ఏకంగా కూర్చొని మాట్లాడుకుందాం రా అంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు. మరోవైపు ‘కన్నప్ప’ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణుకు కుటుంబ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చాడంటే..
జనరేటర్లో పంచదార పోస్తే పేలదు
‘మనోజ్ (Manchu Manoj) పోరాటం దేనికోసం చేస్తున్నారు?’ అని హోస్టు మంచు విష్ణుని అడిగారు. దానిపై విష్ణు స్పందిస్తూ.. తాను కన్నప్ప ప్రచారం కోసం ఈ ఇంటర్వ్యూకు వచ్చానని.. దాని గురించి మాత్రమే అడగండని అన్నాడు. ఫ్యామిలీ వివాదం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదని తెలిపారు. మనం చేసే చర్యలే మన వైఖరికి అద్దం పడతాయని పేర్కొన్నాడు. జనరేటర్లో పంచదార, ఉప్పు పోస్తే.. అవి ఫిల్టర్ ప్రాసెసింగ్లోనే ఆగిపోతాయి కానీ, జనరేటర్ పేలదు అని చెప్పుకొచ్చాడు.
వాళ్లకు సరిపోయే పాత్రలు లేవు
ఇక ‘కన్నప్ప’ గురించి మాట్లాడుతూ.. న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలని చెప్పగానే ఇందులోని అగ్రనటీనటులందరూ అంగీకరించారని విష్ణు తెలిపాడు. ఈ సినిమాలో మోహన్బాబు పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పాడు. మంచు మనోజ్, లక్ష్మిలకు సరిపోయే పాత్ర ఉంటే వారినీ ఎంపిక చేసేవాడినని పేర్కొన్నాడు. తాను నటించిన సినిమా మొదటిసారి భారీస్థాయిలో విడుదలవుతోందని.. శివుడి పైన భారం వేసి ఈ సినిమా పనులు చూసుకుంటున్నానని .. ఆయన ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు విష్ణు.