
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. టీజీ ఈఏపీసెట్ 2025 షెడ్యూల్ ను జేఎన్టీయూ అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చరల్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. నిమిషం లేటుగా వచ్చినా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. రోజూ రెండు సెషన్లలో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు) పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
29 నుంచి ఈఏపీసెట్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా.. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది హాజరు కానున్నట్లు వివరించారు.
రేపే హాల్ టికెట్లు విడుదల
ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఫార్మా, అగ్రికల్చర్ విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో గంటన్నర ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. వేసవి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.