మన ఈనాడు:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో హైకమాండ్ తో చర్చించి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఉన్న కాంగ్రెస్ నేతలకు పదవులతో మరింత జోష్ నింపేందుకు సిద్ధం అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఈ మేరకు లిస్ట్ తో ఢిల్లీలో వెళ్లనున్నారు సీఎం. అధిష్టానం ఆమోద ముద్ర అనంతరం లిస్ట్ లోని పేర్లను ప్రకటించనున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవులను, ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ సీట్లు తక్కువగా గెలిచిన పార్లమెంట్ స్థానాల్లోని నేతలకు ఎక్కువగా నామినేటెడ్ పోస్టులను ఇచ్చే ఆలోచనలో ఉంది హైకమాండ్. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
వాటిని ఎవరికి ఇస్తారన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ స్థానాల్లో అద్దంకి దయాకర్, కోదండ రాం, షబ్బీర్ అలీ, బెల్లయ్య నాయక్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి రానున్నారు. మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కే సి వేణుగోపాలతో భేటీకానున్నారు.