తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ స్పీడును పెంచాయి.. వ్యూహాలకు పదునుపెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై పోటీ విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడం డౌటేననే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ స్పీడును పెంచాయి.. వ్యూహాలకు పదునుపెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై పోటీ విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడం డౌటేననే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డిపై పట్టున్న పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మార్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో షబ్బీర్ అలీ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్లో తన గెలుపు కోసం పని చేయాలని కేడర్ను కోరారు షబ్బీర్ అలీ. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఇకపై పూర్తి స్థాయిలో నిజామాబాద్ అర్బన్పై దృష్టి సారించనున్నారు షబ్బీర్ అలీ. దీంతో షబ్బీర్ అలీ లేకుండానే కేవలం తన తరపున ప్రచారం చేస్తున్న వలస నేతల బృందాలతో రేవంత్ నెట్టుకురాగలడా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇప్పటికే సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కామారెడ్డి నియోజకవర్గంపై ఫోకస్ చేసి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ సభలు పెట్టి బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా పరిష్కరించారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ గులాబీ శ్రేణులకు నూరిపోస్తున్నారు కేటీఆర్. రేవంత్ ప్రచారంపై సెటైర్లు కూడా వేశారు కేటీఆర్.
మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దులో కీలక పాత్ర పోషించి, నియోజకవర్గంపై పట్టు సాధించిన వెంకట రమణారెడ్డి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఈ కారణంగా కామారెడ్డిలో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఫలితాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైతే అసలుకే మోసం వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కామారెడ్డిలో రేవంత్ పోటీ చేయడం అనుమానంగా మారిందని పార్టీ వర్గాలంటున్నాయి.
అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఒకవేళ పోటీలో ఉంటే పరిస్థితి ఏంటి..? లేకపోతే పరిస్థితులు ఎలా ఉండనున్నాయి.. అనే విషయాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదలైతేనే కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీపై జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుంది.