మన ఈనాడు: సరదా కోసం ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్తే శవమైన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం, అమ్మాపురంలో ఆదివారం తల్లిదండ్రులకు కడుపుకొత మిగిల్చిన ఘటన జరిగింది. బేడ బుడగ జంగాల కులానికి చెందిన గంధం స్వామి రూప దంపతుల కుమారుడు యాకూబ్ (12), కిన్నెర మహేశ్ లక్ష్మి దంపతుల కుమారుడు జంపా (10) ఆదివారం సెలవు కావడంతో గ్రామ శివారులోని చెరువు వద్ద వాగులో స్నేహితులతో కలిసి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈత కోసం వెళ్లారు. ఈత రాకపోవడంతో కుంటలో దిగిన ఇద్దరు గంధం యాకూబ్, కిన్నెర జంపా ప్రమాదవశాత్తు మునిగిపోతుండడంతో గమనించిన తోటి మిత్రులు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చే సరికి కుంటలో మునిగిపోయారు.
కుంటలో మునిగిపోయిన చిన్నారులను గ్రామస్థులు బయటకు తీశారు. అప్పటికే చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఒక్కసారిగా బోరున విలపించారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పిల్లలను చూసిన గ్రామస్థులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగదీశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గంధం రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.