ఇష్టపడ్డారు వాళ్లిద్దరూ.. మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కానీ ఇంతలోనే సంసార జీవితంలో అనుమానాలకు తావిచ్చింది.
వారి దాంపత్య జీవితానికి 8ఏళ్లు..కానీ 2సార్లు మాత్రమే వివాహా వార్షొకోత్సవ వేడుకల జరుపుకున్నారు. 2016లో వారు లీపు ఏడాది పెళ్లి చేసుకున్నారు.నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 29న వచ్చిన వివాహ రెండో వార్షికోత్సవం రోజునే భార్యను కత్తితో నరికి చంపేశాడు.
కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు, దివ్య(26) ఎనిమిదేళ్ల క్రితం 2016, ఫిబ్రవరి 29న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప, బాబు సంతానం. నూకరాజు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి రెండుమూడురోజులు ఉండి వస్తుంటాడు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి సర్ది చెప్పారు.
గురువారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. వారి ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించినా.. రోజూ మాదిరిగానే సాధారణ గొడవే అనుకుని సమీపంలో ఉన్న బంధువులు, స్థానికులు పట్టించుకోలేదు. కొద్ది సేపటికి ఇంట్లో నుంచి దివ్య బయటకు రాగా.. అప్పటికే సిద్ధంగా ఉంచిన కత్తిని తీసుకుని వీధిలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన మృతురాలి తోడికోడలు తల్లి లక్ష్మిపై సైతం కత్తితో దాడి చేయగా ఆమె చేతి వేలికి గాయాలయ్యాయి. అడ్డొస్తే నిన్నూ చంపేస్తానని బెదిరించడంతో ప్రాణభయంతో ఆమె పక్కకు వెళ్లిపోయారు.