Mana Enadu: ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతో విజయవాడ(VJA)లోని మొగల్రాజపురంలో మూడు ఇళ్లపై కొండచరియలు(Landslides) విరిగిపడి నలుగురు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆరుగురిని కాపాడారు. వీరిలో నలుగురు గాయపడ్డారు. మరో ఇద్దరి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. రాగల 2 రోజులు భారీ వర్షాలు పడే అందని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు, కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. మరోవైపు గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మరణించారు.
24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విజయవాడ మున్సిపాలిటీలో 24×7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. వరదలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా ప్రజలు ఈ ఫోన్ నెంబర్లకు 0866-2424172, 0866-2427485 ఫోన్ చేసి తెలపాలని కోరారు. 8181960909 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా సమస్యను తెలపవచ్చని, అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో 15, 16, 17, 18, డివిజన్, కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్లని వెంటనే పునరావస కేంద్రాలకు తరలించారు. విజయవాడలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పండిత్ నెహ్రూ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు(Landslides) విరిగిపడిన ఘటనపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం. వారికి అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇస్తాం. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను అధికారులు వెంటనే గుర్తించాలి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సూచించారు. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, విపత్తు నిర్వహణ శాఖ పంపే అలర్ట్ మెసేజ్లను గమనిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు సహాయం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు.