ManaEnadu:వైస్సార్సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Nandigam Suresh) అరెస్టు అయ్యారు. హైదరాబాద్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)పై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. దీంతో రంగంలోకి దిగిన తుళ్లూరు పోలీసులు సురేశ్ను అరెస్టు చేసేందుకు బుధవారం రోజున ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసినా.. ఆయన అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. అరెస్టు భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్ఫోన్ స్విచాఫ్ చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో ఆరా తీశారు.
సిగ్నల్స్ ఆధారంగా ఆయన హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న పోలీసులు త్వరగా అదుపులోకి తీసుకోకపోతే హైదరాబాద్ నుంచి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో వెంటనే నగరానికి వెళ్లారు. అలా పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన పోలీసులు హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ (YSRCP Ex MP Arrest) చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి తీసుకువచ్చారు.
మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ (Devineni Avinash), తలశిల రఘురామ్లు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.