తెలంగాణలో సంచలనం సృష్టించిన SIBలో ఆధారాల ధ్వసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అధికారులకు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నిందితుడు ప్రణీత్ రావు వాంగ్మూలం మేరకు అదనపు SPలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన పోలీసులు..
న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. మరోవైపు కస్టడీ ముగిసిన ప్రణీత్ రావును సైతం జడ్జి ముందు హాజరుపరచగా… రిమాండ్ పొడగించలేదు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ DCPరాధాకిషన్రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న SIB మాజీ DSP ప్రణీత్ రావు వ్యవహారంలో ఇద్దరు ASPలు భుజంగరావు, తిరుపతన్నను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారిని సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. SIBలో హార్డ్డిస్క్లు ధ్వంసం చేసిన విషయంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్రావు ఇచ్చిన వివరాల ఆధారంగా.. కేసులో మాజీ SIB చీఫ్ ప్రభాకర్రావు, మాజీ టాస్క్ఫోర్స్ DCP రాధాకిషన్ రావు, ఐన్యూస్ యజమాని శ్రవణ్ ల పేర్లను FIRలో చేర్చారు. నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ DCP రాధాకిషన్రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో భుజంగరావు, తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు జరిపిన పోలీసులు..శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలవి 41A – CRPC నోటీసులు అందించారు. విచారణ అనంతరం ఇద్దరు ASPలను అరెస్టు చేసినట్లు వెస్ట్జోన్ DCP విజయ్ కుమార్ తెలిపారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా.. కేసు పూర్వాపరాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.