
కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్(Tuni Municipal Vice Chairman) ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార TDP ఉవ్విళ్లూరుతోంది. అయితే మున్సిపాలిటీపై పట్టుకోల్పోకుండా ఉండాలని YCP భావిస్తోంది. ఈ పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే YCP నుంచి 10 మంది కౌన్సిలర్లు TDPలో చేరారు. దీంతో వైసీపీ తమ కౌన్సిలర్లు జారిపోకుండా మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేసేందుకు బస్సును కూడా సిద్ధం చేసింది. ఇటు టీడీపీ కూడా వైస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
చలో తునికి పిలుపు
దీంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 3సార్లు ఎన్నిక వాయిదా పడగా, ఇవాళ నాలుగోసారి ఎన్నికకు అధికారులు సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐతే YCP చలో తునికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. YCP ముఖ్యనేతల కదలికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జక్కంపూడి గణేష్(Jakkampudi Ganesh)ను హౌస్ అరెస్ట్ చేశారు. తుని బయల్దేరేందుకు సిద్ధమైన ఆయన్ని రాజమండ్రిలోనే అడ్డుకున్నారు. లాఠీఛార్జ్లు, తోపులాటలతో పరిస్థితి గందరగోళంగా మారింది. తుని మున్సిపల్ కార్యాలయం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది.
ముద్రగడ పద్మనాభం కాన్వాయ్ అడ్డగింత
మరోవైపు వైసీపీ చలో తునికి పిలుపునిచ్చింది. ఇటు తుని రూరల్ పీస్ దగ్గర ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)ను అడ్డుకున్నారు పోలీసులు. తునిలో ఎవరికీ అనుమతి లేదంటూ బైపాస్ వద్దే కాన్వాయ్ని నిలిపివేశారు. ముద్రగడకు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించారు.
మున్సిపల్ కార్యాలయాన్ని పోలీసులు అష్టదిగ్భందం చేశారు. 200 మీటర్ల దూరం వరకు షాపులన్నీ మూసివేశారు. దాడిశెట్టి రాజా(Dadishetti Raja) మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో స్పెషల్ టీమ్స్(Special Teams) రంగంలోకి దిగాయి.