
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని (Tirumala Temple) దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గంటల సేపు క్యూ లైన్లలో నిల్చొని మరీ స్వామిని దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
19న జులై టికెట్ కోటా విడుదల
ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(Srivari Arjitha Seva Tickets)కు సంబంధించిన జులై నెల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. జులై, 2025కు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవల కోటాను ఈ నెల 19వ తేదీన (శనివారం) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం శనివారం నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని భక్తులకు సూచించింది.
ఆ టికెట్లు ఏప్రిల్ 22న విడుదల
మొబైల్కు మెసేజ్ వచ్చిన భక్తులు ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు అందుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లకు సంబంధించిన జులై కోటాను ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు వివరించారు.