
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ (Union Budget 2025) ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సభలో అన్నదాతల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని (PM Dhan Dhanya Krishi Yojana)’ నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీంతో దాదాపు 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు
మరోవైపు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని (Kisan Credit Card Limit) పెంచారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఈ పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. మరోవైపు పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కంది, మినుములు, మసూర్ లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ పత్తి కమిషన్ ఏర్పాటు
పండ్లు కూరగాయల ఉత్పత్తికి నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2024 జులై నుంచి వందకుపైగా అదికోత్పత్తి వంగడాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పత్తి ఉత్పాదక పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక పత్తి కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.