
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో రథ సప్తమి (ratha saptami 2025) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి జరగనున్న ఈ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేసింది. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారు.. మలయప్ప స్వామి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సర్వదర్శనం టోకెన్లు రద్దు
అనంతరం సప్త వాహనాలపై స్వామి వారు తిరుమల మాఢవీధుల్లో ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మూడ్రోజుల పాటు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది.
వీఐపీ దర్శనాలు రద్దు
మరోవైపు రథ సప్తమి (ఈనెల 4వ తేదీ) రోజు తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రవాస భారతీయులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మినహాయించి మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshan) రద్దు చేసినట్లు వెల్లడించారు.