ManaEnadu : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి (నవంబరు 6వ తేదీ) నుంచి ఇంటింటి సర్వే (Family Survey in Telangana) ప్రారంభం కానుంది. కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ నేతృత్వంలో జరిగే ఈ సర్వే కోసం 85వేల మంది ఎన్యుమరేటర్లు సిద్ధమయ్యారు. వీరిలో దాదాపు 50వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈనెల 8వరకు ముందుగా కుటుంబాలను గుర్తించి… ఇంటింటికి స్టిక్కర్లు వేస్తారు.
నేటి నుంచి ఒంటిపూట బడి
అయితే కులగణన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి(బుధవారం) నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట (Half Day Schools) మాత్రమే పని చేయనున్నాయి. కుల గణనలో ఉపాధ్యాయులు కూడా పాల్గొంటుండటంతో ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించనున్నారు.
50వేల మంది ఉపాధ్యాయులు
ఇక కులగణన(Caste Survey)కు దాదాపు 50వేల మంది ఉపాధ్యాయులను వినియోగించనున్నట్లు సమాచారం. వీరిలో 36 వేల 559 మంది ఎస్జీటీ, 3 వేల 414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6 వేల 256 మంది ఎంఆర్సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. అయితే బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న SGTలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.
75 ప్రశ్నలతో సర్వే
ఇక.. 75 ప్రశ్నలతో కుల గణన (Telangana Caste Survey) చేయనున్నారు. వీటిలో 56 ప్రధాన ప్రశ్నలుండగా మరో 19 అనుబంధ ప్రశ్నలుంటాయి. మొత్తం రెండు పార్టులుగా ఎనిమిది పేజీల్లో సమాచారం పూరించనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు, ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఎవరైనా విదేశాలకు వెళ్లారా? వెళ్తే ఎందుకు వెళ్లారు? మీ కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? వంటి ప్రశ్నలడిగి వివరాలు సేకరించనున్నారు.






