ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) వాడీవేడీగా కొనసాగుతున్నాయి. సోమవారం శాసన మండలి (Legislative Council) ప్రారంభం కాగానే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత(Home Minister Anitha) మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత YCP ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై లెక్కలేనన్ని దారుణాలు జరిగాయని చెప్పారు.
గొప్పల చెప్పుకునేందుకునే దిశ చట్టం: హోంమంత్రి
ఇదిలా ఉండగా హోంమంత్రి మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. అయినా హోంమంత్రి వారికి దీటుగా సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ‘దిశ చట్టం (Disha Act)’ గురించి వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని, అసలు దిశ చట్టం ఉందా? అని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి, లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఆ చట్టమే సరిగా పని చేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవని ఫైరయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, అనితకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
హోంమంత్రి క్షమాపణలు
ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో 2023లో జనవరి- అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 22,418 నేరాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 14650 కేసులు మాత్రమే నమోదయ్యాని తెలిపారు. కాగా వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై తాను మాట్లాడుతుంటే, వాటికి సమాధానం ఇచ్చే దమ్ము, ధైర్యం లేక సభ నుంచి పారిపోయారని అనిత సెటైర్లు వేశారు. అయితే, గౌరవ మంత్రి స్థానంలో ఉండి దమ్ము, ధైర్యం అనే పదాలు వాడటం సరికాదని మండలి ఛైర్మన్ వ్యాఖ్యానించడంతో ఆమె క్షమాపణ చెప్పారు.






