Mana Enadu : అంతా అనుకున్నట్టుగానే.. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే.. జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను శుక్రవారం రోజున ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్.. రెపో రేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
వరుసగా 11వ సారి రెపో రేటు యథాతథం
2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలోపెట్టుకొని ఈసారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయొద్దని నిర్ణయించినట్లు శక్తికాంతా దాస్(RBI Governor Shaktikanta Das) చెప్పారు. డిసెంబరు 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆయన నేడు వెల్లడించారు.
ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు ఇవే
- గత ద్వైమాసిక సమీక్షలో వాస్తవ జీడీపీ (GDP) వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేశాం. కానీ ప్రస్తుతం కాస్త తగ్గించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.6శాతంగా అంచనా వేశాం.
- ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అంచనాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యల్బణం ఈ ఏడాదికి 4.8 శాతం ఉండొచ్చని అంచనా.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కరెంట్ ఖాతా లోటు స్థిరంగా ఉండగా.. ద్రవ్య లభ్యత మిగులు స్థాయిలోనే ఉంది.
- ఈ ఏడాది ఆర్థిక రంగం ఉత్తమంగా ఉండటంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలంగా కొనసాగుతున్నాయి.
- క్యాష్ రిజర్వ్ రేషియో (Cash Reserve Ratio)ను 4.5శాతం నుంచి 4 శాతానికి తగ్గించి.. బ్యాంకులకు రూ.1.16 లక్షల కోట్ల నగదును అందుబాటులో ఉంచుతాం.
- రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వడ్డీరేటు పరిమితి పెంపు.
- వ్యవసాయ రంగంలో తనఖా లేని రుణాల పరిమితి పెంపు. రూ.1.6లక్షల నుంచి రూ.2లక్షలకు పెరుగుదల.







