
Mana Enadu : నీట్ పరీక్ష (NEET 2025) రాయాలనుకునే విద్యార్థులకు అలర్ట్. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష నిర్వహణలో పలు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఏ 2025 పరీక్షల్లో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2025 నుంచి ఎన్టీఏ ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని .. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించదని స్పష్టం చేశారు.
పెన్ పేపర్ OR ఆన్లైన్
ఇక వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్ష నిర్వహణపై ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) మాట్లాడారు. “నీట్ పరీక్షను పెన్-పేపర్ విధానంలో నిర్వహించాలా లేదా ఆన్లైన్లో నిర్వహించాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నాం.భవిష్యత్లో కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్, టెక్ ఆధారిత ప్రవేశ పరీక్షలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర సర్కార్ ఉంది. వచ్చే ఏడాదిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. కొత్తగా 10 పోస్టులు సృష్టిస్తాం.” అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఎన్టీఏ ఆ పరీక్షలు నిర్వహించదు
మరోవైపు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకే ఎన్టీఏ పరిమితమవుతుందని వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించబోదని స్పష్టం చేశారు. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-UGని ఏడాదికి ఒకసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు. జీరో ఎర్రర్ టెస్టింగ్ ఉందని నిర్ధరించడానికి NTA పని తీరులో అనేక మార్పులు ఉంటాయని వివరించారు.