Mana Enadu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) పదవీ కాలం ఈ నెలఖారుతో ముగియనుంది. జూన్ 7న సీఎస్గా బాధ్యతలు తీసుకున్న ఆయన నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇప్పుడు కొత్త సీఎస్ (AP Next CS) గా సర్కార్ ఎవర్ని నియమించబోతోందనే విషయం చర్చనీయాంశమైంది. అయితే లిస్టులో 8 మంది పేర్లున్నా.. వారిలో ఐదుగురి పేర్లనే ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలిసింది.
లిస్టులో 8 మంది పేర్లు
సీనియారిటీ ప్రకారం.. ఆ లిస్టులో కాంట్రవర్సియల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ (Sree Laxmi), అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇతర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉన్నారు.
పరిశీలనలో ఐదుగురి పేర్లు
అయితే వీరిలో వైఎస్సార్సీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మీ, అజయ్ జైన్ను పరిశీలనలోకి తీసుకోరని తెలిసింది. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా కూడా పరిశీలనలోకి రారు. ఇక మిగిలిన ఐదుగిరిలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? లేక పదవీకాలం ఎక్కువ ఉన్న వారికి ఛాన్స్ ఇస్తారా? అన్ని తెలియాల్సి ఉంది. ఇక మిగిలిన ఐదుగురిలో విజయానంద్ (Vijayanand) వచ్చే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయనుండగా.. సాయిప్రసాద్ 2026 మే లో, ఆర్పీ సిసోదియా 2028 జనవరిలో రిటైర్మెంట్ తీసుకోనున్నారు.
వారికే సీఎస్ గా అవకాశం
ఈ లెక్కన ముందుగా పదవీ విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్ ఉన్నారు. ఆ తర్వాత వరుసలో సాయిప్రసాద్, సిసోదియా నిలిచారు. అయితే టీడీపీ సర్కార్ గత నిర్ణయాలు పరిశీలిస్తే పదవీ విరమణ చేసే వారికి అవకాశం ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి. మరి ఈ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో త్వరలోనే తెలియనుంది.






