సావర్కర్ పరువునష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. ఈ కేసులో పుణెలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరు కాగా.. కోర్టు ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేసింది.
అసలు కేసు ఏంటంటే..?
2023లో లండన్లో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహితులతో కలిసి ఓ ముస్లిం యువకుడిని చితకబాది ఆనందించానని స్వయంగా సావర్కర్ (savarkar) తన పుస్తకంలో రాసుకున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. దీనిపై సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ మండిపడ్డారు. అది పూర్తిగా అవాస్తవమని, ఊహాజనిత ఆరోపణలు అని రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా సావర్కర్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు పదేపదే యత్నిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు.






