గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, HCU విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూమి మాత్రం ప్రభుత్వానిదేనని రాష్ట్ర సర్కార్ తేల్చి చెబుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మాట్లాడారు. ఈ 400 ఎకరాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు.
వాళ్లంతా రాజకీయ నాయకులే
“హైకోర్టు (High Court), సుప్రీంకోర్టుల్లో దీనిపై వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుంది. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(University Of hyderabad)కి చెందినది లేదు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఇక్కడ సర్కార్ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులే. రియల్టర్ల ప్రయోజనాల కోసం కొందరు నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు.” అంటూ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూ వివాదంపై ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ భూమి కేటాయింపుపై రిట్ పిటిషన్
2003 జనవరి 13న నాటి ప్రభుత్వం ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు మెమో నం.39612/ఏఎస్ఎస్ఎన్/వి(2) 2003 ప్రకారం కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) గ్రామంలోని భూమిని కేటాయించిందని మంత్రి పొంగులేటి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంటుకు కేటాయించగా.. ఈ కేటాయింపుపై ఐఎంజీ అకడమీస్ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు.
ఆ భూమి ప్రభుత్వానిదే
ఉమ్మడి ఏపీలో రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ (KCR Govt), తాజా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ భూమి ప్రభుత్వానిదని వాదనలు వినిపించాయని మంత్రి తన ప్రకటనలో చెప్పారు. 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. దీన్ని ఐఎంజీ సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేయగా 2024 మే 3న సదరు పిటిషన్ను కొట్టివేయడంతో ఈ 400 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి దక్కాయని పేర్కొన్నారు.
400 ఎకరాల్లో లేక్, పికాక్ లేక్లు లేవు
“2024 జూన్ 19న ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆ భూమిని కేటాయించాలని టీజీఐఐసీ (TGIIC) ప్రతిపాదనలు సమర్పించగా.. రెవెన్యూశాఖ జూన్ 24న ఆ భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయించింది. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు భూమికి పంచనామా నిర్వహించి జులై 1న అప్పగించారు.. 19న వర్సిటీ రిజిస్ట్రార్, ఇంజినీర్, ఈఈతో కలిసి రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. ఈ 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పికాక్ లేక్లు లేవని అధికారులు తెలిపారు.” అని మంత్రి తన ప్రకటనలో వివరించారు.






