జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనను యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ స్పందిస్తూ.. ఈ దాడి అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉందని అన్నారు.
ఇది పుల్వామా-2 అటాక్
పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని పుల్వామా-2గా భావించాలని జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ (Jammu Kashmir Ex DGP) అన్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన దాడి అని తెలిపారు. రెండ్రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని ప్రస్తావించిన శేష్ పాల్.. అవి యాదృచ్ఛిక వ్యాఖ్యలు కావని.. ఎందుకంటే పర్యటకులను చంపేటప్పుడు వారు హిందువులా కాదా అడిగి మరీ చంపారని గుర్తు చేశారు. ఇజ్రాయెల్ పై దాడికి తెగబడ్డ హమాస్ ముష్కరులు.. ఎలా దాడి చేశారో వీళ్లు కూడా పర్యటకులపై అలాగే దాడికి పాల్పడ్డారని అన్నారు.
#WATCH | #PahalgamTerroristAttack | Jammu, J&K | Former J&K DGP Shesh Paul Vaid says, “This is the Pulwama 2 moment of India. This was a Hamas-style attack on 7 October on Israel. It’s not a coincidence that Asim Munir (Pakistan Army chief) uttered illogical words two days back,… pic.twitter.com/7LeIjL2cse
— ANI (@ANI) April 23, 2025
దాడి చేసింది పాక్ ఎస్ఎస్జీ కమాండోలు
“హమాస్ దాడిని ఇజ్రాయెల్ (Israel Hamas War) ఎలా తిప్పికొట్టిందో.. పహల్గామ్ లో జరిగిన దాడిని భారత్ కూడా అలాగే తిప్పికొట్టాలి. ఇది ఉగ్రవాదుల దాడి కాదు. పర్యటకులపై దాడి చేసింది పాకిస్థాన్ ఎస్ఎస్జీ (Pakistan SSG). ఉగ్రవాదుల ముసుగులో వచ్చిన పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలు పర్యటకులపై కాల్పులు జరిపారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇక నుంచి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్, పీఓకే (PoK) ప్రజలారా.. పాక్ సైన్యం చేసిన ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా తిరుబాటు చేయండి. స్వాతంత్య్రం ప్రకటించుకోండి.” అని జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ తెలిపారు.






