Tirumala Leopards: తిరుమల నడక దారిలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. గత వారం మెట్ల మార్గంలో వెళుతున్న చిన్నారిని చిరుత చంపేయడంతో దానిని పట్టుకోవడం కోసం బోన్లను ఏర్పాటు చేశారు.
తిరుమలలో నడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. గత వారం తిరుమల మెట్ల మార్గంలో తల్లిదండ్రులతో కలిసి వెళుతున్న లక్షిత అనే చిన్నారిని చిరుత చంపేసింది. దీంతో టీటీడీ ఆపరేషన్ చిరుత పేరుతో చిరుతల్ని బంధించే కార్యక్రమాన్ని చేపట్టింది.
నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. బాలికపై దాడిచేసి చిరుత చంపేసిన నేపథ్యంలో భక్తులు భయాందోళనకు గురి కాకుండా ఉండేందుకు ట్రాప్లను ఏర్పాటు చేశారు. చిరుత దాడి చేసి చంపేసిన తర్వాత నడక మార్గానికి ఇరువైపులా కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. వీటిలో పలు కెమెరాల్లో చిరుత పులుల కదలికలను గుర్తించారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన బోనులో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత చిరుత చిక్కినట్టు సిబ్బంది గుర్తించారు. మోకాలి మెట్టు వద్ద మరో ట్రాప్ ఏర్పాటు చేశారు. శేషాచలం అడవుల్లో దాదాపు 40కు పైగా చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో దాదాపు పది చిరుతలు మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి.చిన్నారి లక్షిత ఉదంతం తర్వాత అటవీ శాఖ అప్రమత్తమైంది. మెట్ల మార్గానికి ఇరువైపులా కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు. దాదాపు 500కెమెరాలను చిరుతల కదలికలు గుర్తించేందుకు వినియోగించారు.
మెట్ల మార్గానికి సమీపంలో ఒకే ప్రాంతంలో చిరుతల కదలికలు ఉండటంతో వాటి కోసం బోనుల్ని ఏర్పాటు చేశారు. 35వ మలుపు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.
కోవిడ్ సమయంలో తిరుమల నడక మార్గం నిర్మానుష్యంగా ఉండటంతో వన్య ప్రాణుల సంచారం పెరిగింది. మెట్ల మార్గానికి సమీపంలో పది చిరుతలు వస్తున్నట్లు గుర్తించారు. ఆహారం కోసమే మనుషులు సంచరించే ప్రాంతాలకు చిరుతలు దగ్గరగా వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఆహారం పడేయడం, వన్యప్రాణులకు అందించడం వంటివి చేస్తున్నారు. వీటి కోసం జింకల వంటి జంతువులు మనుషులకు సమీపంలోకి వస్తున్నాయి. వీటిని వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
లక్ష్మీనరసింహ ఆలయం సమీపంలోనే చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు వివరించారు. బోనులో చిక్కే క్రమంలో చిరుత గాయపడడంతో, దానిలో చిక్కిన చిరుతను ఎస్వీ జూకు తరలించి సంరక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
గత యాభై రోజుల వ్యవధిలో మూడు చిరుతల్ని టీటీడీ అధికారులు బంధించారు. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు అవసరమని టీటీడీ స్పష్టం చేస్తోంది






