Mana Enadu : దిల్లీ సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి హస్తిన పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం షురూ చేసారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సవాల్ విసిరారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) ముందు దేశంలోని 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తే.. తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఛాలెంజ్ చేశారు.
జనతా కీ అదాలత్
తమ డిమాండ్ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా అని మోదీ (PM Modi)కి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని అన్నారు. హర్యానా (Haryana Election Results 2024), జమ్మూకశ్మీర్లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
దిల్లీలో ఎల్జీ రాజ్యం
హర్యానా, జమ్మూకశ్మీర్(Jammu Kashmir Election Results)లలో బీజేపీ ప్రభుత్వాల పతనం ఖాయం. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే.. ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమే. బీజేపీ ప్రజావ్యతిరేకం. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు దిల్లీలో హోమ్గార్డుల వేతనాలను నిలిపివేసింది. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ఎల్జీ (Delhi LG) రాజ్యం నడుస్తోంది అని అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
దిల్లీ లిక్కర్ (Delhi Excise Policy Scam) వ్యవహారంలో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అది ప్రజలకూ తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రజాక్షేత్రంలోనే తన నిజాయతీని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేసి.. తన కేబినెట్ లో ఉన్న మంత్రి అతీశీకి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు.