బంగ్లాదేశ్ ఆర్మీ భారత్ ను కావాలనే రెచ్చగొడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో కిల్లర్ డ్రోన్లను(Killer drones) మోహరించిన బంగ్లాదేశ్ తాజాగా మరో దుస్సాహసం చేసింది. భారత్ బోర్డర్ లోకి వచ్చి ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అస్సాంలోకి (Assam) అక్రమంగా ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్ లో ముస్లింలకు కించపరుస్తుందని దీంతో అక్కడ హింస చెలరేగే అవకాశముందని వాదించారు.
ఆలయం నిర్మాణాన్ని అడ్డుకుని బెదిరింపులు
గురువారం అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కుషియారా నది సమీపంలోని ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుషియారాలో నిమజ్జన ఘాట్ లో ఉన్న మానస ఆలయ పునరుద్ధరణకు ఇటీవల అస్సాం ప్రభుత్వం 3 లక్షల రూపాయలను మంజూరు చేసింది. బంగ్లాదేశ్ (Bangladesh) జకింగంజ్ సరిహద్దు అవుట్ పోస్టుకు చెందిన కొంతమంది సిబ్బంది స్పీడ్ బోట్ ద్వారా భారత సరిహద్దుల్లోకి వచ్చిన, ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల్ని బెదిరించారు. అక్కడ నివసించే స్థానిక హిందువులను బెదిరించినట్లు వెంటనే ఆలయ నిర్మాణాన్ని ఆపేయాలని హెచ్చరించినట్లు సమాచారం.
ఇకపై బోర్డర్ ప్రోటోకాల్ ఏర్పాటు
భారత్ నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) (BSF) అక్కడికి చేరుకుని గ్రామస్థులు, బంగ్లా గార్డ్స్ కు మధ్య ఉద్రిక్తత పెరగకుండా తగ్గించింది. భారత్ భూభాగంలోకి వచ్చి, భారతీయులను బెదిరించే అధికారం మీకు లేదని బంగ్లా గార్డ్స్ ను హెచ్చరించింది. స్థానికులు, బీఎస్ఎఫ్ నుంచి బలమైన ప్రతిఘటన ఎదురుకావడంతో బంగ్లాదేశ్ గార్డ్స్ వెనక్కి తగ్గారు. ఈ ఘటనపై బీఎస్ఎఫ్ బోర్డర్ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ చట్టాలను
(International laws) ఉల్లంఘించారని భూభాగంలోకి ప్రవేశించే ముందు బీఎస్ఎఫ్ కు తెలియజేయాలని అనుమతి పొందాలన్నారు. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒకరి భూభాగంలోకి ఒకరు వచ్చే క్రమంలో ఆయుధాలు కలిగి ఉండొద్దని చెప్పింది. స్థానికులు బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.






