Mana Enadu : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదారి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈనెల 20వ తేదీన తులసి అనే మహిళ ఇంటికి వచ్చిన పార్శిల్ లో మృతదేహం ఉండటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా.. విద్యుత్ సామగ్రికి బదులు డెడ్ బాడీ రావడంతో స్థానికులు షాకయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ కేసు మిస్టరీ వీడిందని ఎస్పీ అద్నాన్ నయీం తెలిపారు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ నయీం తెలిపిన వివరాల ప్రకారం
ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చెక్కపెట్టలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో రేవతి, వర్మ, సుష్మ అనే ముగ్గురి పాత్ర ఉందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. తులసి ఆస్తి కాజేసేందుకు ఆమె సోదరి రేవతి, ఆమె భర్త శ్రీధర్ వర్మ పక్కా ప్లాన్ ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టారని వెల్లడించారు. ఇందులో వర్మ లవర్ సుష్మ కూడా సాయం చేసినట్లు చెప్పారు.
“రంగరాజు అనే వ్యక్తికి తులసి, రేవతి అనే కుమార్తెలుండగా.. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసి కూడా వివాహం జరిగినా.. భర్త వదిలేయడంతో ఆమె తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. రంగరాజుకు రెండున్నర ఎకరాల పొలం, కొంత స్థలం, బంగారం ఉన్నాయి. మరో మహిళ సుష్మకు అప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. ఫేస్ బుక్ ద్వారా శ్రీధర్ వర్మతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీధర్, సుష్మ కలిసే ఉంటున్నారు. వీరికిద్దరికి మూడు పెళ్లిళ్లు జరిగాయి.
తులసిని బెదిరించి ఆస్తి కాజేసేందుకు శ్రీధర్ వర్మ, రేవతి, సుష్మ కలిసి ఓ పక్కా ప్లాన్ వేశారు. ఆమె ఇంటికి ఓ శవాన్ని పంపి భయపెట్టాలనుకున్నారు. కానీ వారికి డెడ్ బాడీ దొరకకపోవడంతో ఎవర్నైనా మర్డర్ చేయాలని పథకం వేశారు. అందుకోసం తమ ఇంటికి సమీపంలో ఉండే పర్లయ్యను ఎంచుకున్నారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మెడకు తాడు బిగించి హత్య చేశారు. డెడ్ బాడీని చెక్క పెట్టెలో పెట్టి మరుసటి రోజు ఉదయం ఆటోలో తులసి ఇంటికి పార్శిల్ పంపారు.
పార్శిల్ లో డెడ్ బాడీ చూసిన తులసి ఆందోళనకు గురి కాగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీధర్ వర్మ, రేవతి, సుష్మ ఈ విషయం బయటకు తెలియకుండా చూసుకుంటామని.. అలా చేయాలంటే ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని అడిగారు. సైన్ చేస్తావా.. నువ్వూ శవం అవుతావా అంటూ బెదిరించడంతో ఆమె వాష్ రూమ్ కు వెళ్లొస్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్లింది. తన వద్ద మొబైల్ తో తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం చెప్పగా వారంతా అక్కడికి చేరి ఏం జరిగిందో ఆరా తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు.” అని పోలీసులు తెలిపారు.







