అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై ఇప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడింది. ఎయిరిండియా విమానం పైలట్(Pilot) ఫ్యూయల్ స్విచ్(Fuel switch)ను షట్ డౌన్ చేశారంటూ కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయి. దీనిపై AAIB స్పందిస్తూ, కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు నిరాధార, ధ్రువీకరించని నివేదికల ద్వారా విమాన ప్రమాదంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.
త్వరలో తుది నివేదికను విడుదల చేస్తాం
ఇటువంటి చర్యలు బాధ్యతారాహిత్యమైనవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్(AAIB Director General GVG Yugandhar) ఒక ప్రకటనలో తెలిపారు. నిరాధార సమాచారం(Unfounded information)తో భారత విమానయాన రంగం భద్రత (Indian aviation sector safety) పట్ల ప్రజల్లో ఆందోళనను సృష్టించేందుకు ఇది తగిన సమయం కాదని AAIB పేర్కొంది. ప్రమాదానికి గల మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు విశ్వసనీయతను దెబ్బతీసే కథనాలను వ్యాప్తి చేయవద్దని సూచించింది.
ప్రమాదంలో మొత్తం 260 మందికిపైగా మృతి
కాగా, జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్(London) బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్(Medical College Hostel)పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని ఓ ప్రయాణికుడు మినహా మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఘటనాస్థలంలో ఉన్న పలువురు మెడికల్ సిబ్బంది మృతి చెందారు. శరీరాలు గుర్తుపట్టరాని విధంగా మారడంతో.. అధికారులు డీఎన్ఏ పరీక్షలు(DNA Tests) నిర్వహించారు. దాదాపు రెండు వారాల తర్వాత ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.






