Mana Enadu : బంగారం ధరలు (Gold Prices) మండిపోతున్నాయి. గతేడాది కాలంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఓ బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గవని, వచ్చే ఏడాది ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ, పెట్టుబడుల సేవల సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ (Goldman Sachs) అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్సు బంగారం (31.10 గ్రాములు) ధర 3,150 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. 24 క్యారెట్ల బంగారం రేటు మన దేశీయ కరెన్సీలో గ్రాముకు రూ.8,553 కావచ్చని అంచనా వేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (ounce) బంగారం రేటు 2650 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర గ్రాముకు రూ. 7800 స్థాయిలో ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం రూ. 7100 వద్ద ట్రేడింగ్ అవుతోంది. రానున్న కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని.. వచ్చే ఏడాది చివరి నాటికి 19 శాతం వృద్ధితో 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.85,530 వరకు చేరుకోవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,000 మార్క్ దాటవచ్చని జోస్యం చెప్పింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం (inflation), పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు భారీగా పెంచుకుంటుండటం గోల్డ్ రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు గోల్డ్ మ్యాన్ శాక్స్ నివేదిక విశ్లేషించింది. రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ వంటి వివిధ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధాలు పసిడి గిరాకీకి ప్రధాన కారణంగా నివేదిక తెలిపింది. యూబీఎస్ సంస్థ సైతం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తింది. ఔన్సు బంగారం ధర వచ్చే నెలలోనే 2900 డాలర్లు దాటవచ్చని తెలిపింది.






