తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో చలి తీవ్రత (Telangana Weather News) విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుందని.. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగితా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
తెల్లవారుజాము ప్రయాణాలొద్దు
తెల్లవారుజాము ప్రయాణాలు మానుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా తెలిపారు. పొగమంచు అధికంగా కురుస్తున్నందున రహదారి కనిపించక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజాము ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ఒకవేళ చేయాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు పాటించాలని.. హెడ్ లైట్స్ ఆన్ చేసుకుని.. మీడియమ్ స్పీడుతో వెళ్లాలని చెప్పారు.







