Mana Enadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల (Telugu States Floods) నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొంది. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పింది. రద్దయిన వాటిలో సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయని.. పలు పాసింజర్ రైళ్ల (Passenger Trains)ను కూడా రద్దయ్యాయని వెల్లడించింది. ప్రయాణికులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం, విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్, విజయవాడ నుంచి సికింద్రాబాద్ (Vijayawada To Secunderabad), సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి గుంటూరు. సికింద్రాబాద్ నుంచి గూడూరు, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి చాపరా, చాపరా టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూ దిల్లీ, న్యూదిల్లీ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, తాంబరం నుంచి హైదరాబాద్, సంబల్పూర్ నుంచి హెచ్ఎస్ నాందేడ్, లింగంపల్లి నుంచి కాకినాడ పోర్టు (Lingampally To Kakinada Port), కాకినాడ పోర్టు టు లింగంపల్లి, మచిలీపట్టణం నుంచి బీదర్, బీదర్ టు మచిలీపట్టణం, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టూ న్యూ దిల్లీ, కొచ్చివేలి టు కూర్బా, , బిలాస్పూర్ నుంచి ఎర్నాకులం, ఎర్నాకులం నుంచి బిలాస్పూర్.
650కి పైగా బస్సులు రద్దు..
మరోవైపు వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ ఆర్టీసీ భారీగా బస్సు సర్వీసుల (Telangana RTC Buses)ను రద్దు చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కీలక జాతీయ రహదారి అయిన హైదరాబాద్ – విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ 650కి పైగా బస్సులను రద్దు చేసింది. వాటిలో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాకు చెందినవి 150, రంగారెడ్డి జిల్లాకు చెందినవి 70కిపైగా, మిగిలినవి ఇతర జిల్లాలకు సంబంధించినవి ఉన్నాయి.
మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు (Railway Track) మరమ్మతలు మొదలయ్యాయి. కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసలపల్లి మార్గంలో ఈ రైల్వే ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకు మరమ్మతు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు మరమ్మతు చేపడుతున్నారు.






