IPL 2025లో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఇక ప్లే ఆఫ్స్(PlayOffs) మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్(Final)తో సహా మొత్తం 4 మ్యాచ్లతో ఈ సీజన్ ముగియనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ క్వాలిఫయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) తలబడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంది. 2016 తర్వాత ఆర్సీబీ ఫైనల్కు చేరలేదు. మరోవైపు 2014 తర్వాత పంజాబ్ ఫైనల్కు వెళ్లలేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రెండు జట్లకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు.
సూపర్ ఫామ్లో ఉన్న రెండు జట్లు
కాగా ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న ఈ రెండు జట్లు ఈ సారి ట్రోఫీ గెలవడానికి ఇదొక చక్కని అవకాశం. ఈ బ్లాక్బస్టర్ మ్యాచ్ చండీగఢ్లో జరగనుండడంతో పంజాబ్ జట్టుకు కలిసి రానుంది. మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ సమరంలో పంజాబ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. టోర్నీలో 14 మ్యాచ్ ల్లో 19 పాయింట్లతో పంజాబ్ టేబుల్ టాపర్గా గ్రూప్ స్టేజ్ ముగించింది.
పంజాబ్కే ప్లస్ అవుతుంది..
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ల్లో 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే లీగ్ దశలు టాప్లో ఉన్న పంజాబ్ ఫైనల్కు చేరుతుంది. గ్రూప్ స్టేజ్ లో పంజాబ్, ఆర్సీబీ సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పంజాబ్ కు ఎక్కువగా ఉంది. పంజాబ్ నెట్ రన్ రేట్ +0.372 ఉంటే ఆర్సీబీ నెట్ రన్ రేట్ +0.301 ఉంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. దీంతో పంజాబ్ టేబుల్ టాపర్ కాబట్టి ఫైనల్కు వెళ్తుంది. కాగా మ్యాచ్ రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రారంభమవుతుంది.






