టాలీవుడ్ ను ఇటీవల చుట్టుముట్టిన వివాదాల్లో మంచు ఫ్యామిలీ గొడవ (Manchu Family Fight) ఒకటి. అయితే ఇప్పుడిప్పుడే ఈ గొడవ సద్దుమణుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త టెన్షన్ షురూ అయింది. మంచు మనోజ్ (Manchu Manoj) తిరుపతిలో పర్యటించేందుకు వెళ్లారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. అయితే ఆయన తిరుపతి పర్యటనలో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University)కి వెళ్లనున్నట్లు సమాచారం.
ఎంబీయూ వద్ద టెన్షన్
ఈ నేపథ్యంలో ఎంబీయూ (MBU) వద్ద పరిస్థితులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నాయి. అయితే ఎంబీయూకి రావొద్దంటూ ఇప్పటికే మనోజ్ కు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన వల్ల అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మంచు విష్ణు (Manchu Vishnu) మంగళవారం రోజునే తిరుపతి నుంచి వెళ్లిపోయారు. కానీ మోహన్ బాబు మాత్రం అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనోజ్ అక్కడికి వెళ్లనున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయినట్లు సమాచారం.
మనోజ్ తిరుపతి టూర్ షెడ్యూల్
ఈ పర్యటనలో మనోజ్ (Manchu Manoj Tirupati Visit) మొదట తన బంధువుల ఇంటికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస మంగాపూరం చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయల్దేరనున్నారు. 12.50 గంటలకు నారావారిపల్లెను సందర్శించి.. 1.30 గంటలకు జల్లికట్టు కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంబీయూ క్యాంపస్ కు వెళ్లి.. ఆ తర్వాత అనాథ శరణాలయాలను సందర్శించనున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో ఎంబీయూ సందర్శనలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.








