తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) స్పందించారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారన్న ఆయన.. యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్టీ ఓకే.. ప్రభుత్వమే క్లియర్ గా లేదు
“కాంగ్రెస్ క్లియర్గా ఉంది. కానీ ప్రభుత్వమే క్లియర్గా లేదు. నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారు. బీసీలను అణచివేయాలని చూస్తున్నారు. షోకాజ్ నోటీసులపై ఈనెల 12వ తేదీలోగా ఆలోచిస్తాను. బీసీ (BC Caste Survey) సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తాను.” అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.
వివరణ ఇవ్వాల్సిందే
కులగణనపై ఇష్టారీతిన మాట్లాడటం, నివేదికను తగలబెట్టడాన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల డెడ్ లైన్ విధించింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. పార్టీ లైన్ దాటి మాట్లాడటం, కులగణనపై తీవ్ర విమర్శలు చేయడంపై ఈ నెల 12లోగా రిప్లై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.







