మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసు (Hyderabad Formula E Race Case)కు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
సుప్రీంలో కేటీఆర్ కు షాక్
హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ (KTR ACB Case) పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు (Telangana HC) ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8వ తేదీన కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేటీఆర్ పిటిషన్ డిస్మిస్
జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం కేటీఆర్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపింది. కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని.. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని సుప్రీంకోర్టు (Supreme Court) దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా..? అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నిస్తూ.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు.
విత్ డ్రా చేసుకునే అవకాశం
ఈ నేపథ్యంలో పిటిషన్ వెనక్కి తీసుకుని.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. దానికి అంగీకరించిన ధర్మాసనం పిటిషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తూ.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు.







