Mana Enadu : ఇజ్రాయెల్- హమాస్ (Hamas) మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో పాల్గొంటున్నామని చెబుతూనే ఇజ్రాయెల్ (Israel) దాడులకు తెగబడుతోంది. మంగళవారం రోజున ఐడీఎఫ్ దళాలు గాజాపై మరోసారి విరుచుకుపడ్డాయి. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఓ నివాస భవనంపై చేసిన దాడిలో 55 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
స్పందించని ఇజ్రాయెల్
శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్(Palestine Civil Emergency Services) వెల్లడించింది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపింది. ఈ దాడులతో సుమారు లక్షమంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లేక అలమటిస్తున్నారని పేర్కొంది. మరోవైపు ఈ దాడిపై ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఉత్తర గాజాలో 109 మంది మృతి
మరోవైపు, గాజా (Gaza) ఉత్తర ప్రాంతంలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న ఐదు అంతస్తుల భవనంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 109 మంది మృతి చెందారు. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) అమెరికాను కోరింది.
ఒప్పందం సంగతేంటి?
ఇక ఏ వైపు నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియక గాజా (Gaza Attacks) పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఏ సమయంలో ఎక్కడి నుంచి బాంబు పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో పాల్గొంటున్నామంటూ ఓవైపు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామంటూ హమాస్ కూడా చెబుతోంది. అలా ఒప్పందం వైపు అడుగులు పడుతున్నా గాజాలో దాడులు మాత్రం ఆగడం లేదు.