ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మంగళవారం నాడు ముంబైలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ ఈ మేరకు జట్టును అనౌన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికలుగా టీ20 ఫార్మాట్లో జరగనుంది. అయితే ఐపీఎల్ 2025లో తన జట్టును ఫైనల్స్ వరకు నడిపించినా, పరుగుల వరద పారించినా శ్రేయాస్ అయ్యర్కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతనికి స్థానం కల్పించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెలెక్టర్ల నిర్ణయంపై అసంతృప్తి
సెలెక్టర్ల నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఇంత మంచి ఫామ్లో ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారు?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా శ్రేయస్కు మద్దతుగా నిలిచారు. షార్ట్ బాల్స్ను ఎదుర్కోవడంలో అతని సామర్థ్యాన్ని, ఐపీఎల్ ప్రదర్శనను ప్రశంసిస్తూ, అతన్ని జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో అద్భుతంగా రాణించినా..
ఐపీఎల్ తాజా సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 17 ఇన్నింగ్స్లలో 50.33 సగటు, 175.07 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు సాధించాడు. ఇంతటి అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ, అతడిని పక్కన పెట్టడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. “శ్రేయస్ను ఎవరి స్థానంలో తీసుకోవాలి? ఇది అతని తప్పు కాదు, కానీ మేము 15 మందిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంది” అని వివరించాడు.
ఆసియా కప్కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, ఆర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
స్టాండ్బై ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
🚨 A look at #TeamIndia‘s squad for #AsiaCup 2025 🔽 pic.twitter.com/3VppXYQ5SO
— BCCI (@BCCI) August 19, 2025






