Mana Enadu: డైరెక్టర్ అవ్వాలనుకుని హీరో అయిన వాళ్లు.. హీరో అవ్వాలని ఆశతో వచ్చి ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా స్థిరపడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఓవైపు దర్శకత్వం.. మరోవైపు నటులుగా, హీరోలుగా రాణిస్తున్న వారూ ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ప్రతి యువతీయువకుడు తన సినిమాతో రిలేట్ చేసుకునేలా చేశాడు తరుణ్. అయితే ఈయన కేవలం దర్శకుడే కాదు మంచి నటుడు కూడా.
సమయం, అవకాశం వచ్చినప్పుడల్లా తనలోని నటను బయటకు తీసి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్నాడు. దర్శకుడిగా పెళ్లిచూపులు సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన తరుణ్ భాస్కర్.. ఇప్పుడు హీరోగా ఇడుపు కాయితం పంచాయితీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి మరి ఈ క్రేజీ న్యూస్.

తరుణ్ భాస్కర్-వేణు ఊడుగుల కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్, దొలముఖి సుభుల్ట్రన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, బూసమ్ జగన్ మోహన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ గౌడ్-శ్రీలత విడాకుల పంచాయతీకి సంబంధించిన స్టాంప్ పేపర్తో డిజైన్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ జంటకు విడాకులు ఇప్పించడానికి నటీనటులు కావాలంటూ ఓ డివోర్స్ నోటీస్ రూపంలో క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
“12-12-2024 బేస్తారం రోజున శ్రీలతకు, శ్రీనివాస్గౌడ్కు ఇడుపు కాయితం పంచాయతీ జరుగుతాంది. ఆ పంచాయతీ పెద్దలుగా, సాక్షులుగా, కుటుంబసభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి” అని తరుణ్ భాస్కర్ టీం కాస్టింగ్ కాల్ అప్డేట్ ఇచ్చింది.
ఈ సినిమా మధ్యతరగతి వాళ్ల రోజువారీ జీవితాల్లో జరిగే మనస్సును కదిలించే భావోద్వేగ సన్నివేశాలతో ఉండబోతుందని టాక్. అలాగే తరుణ్ భాస్కర్ సినిమాల్లో ఎప్పుడూ ఉండే ఫన్ ఎలిమెంట్ కూడా బోలెడంత ఉంటుందట. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కుటుంబ కథా చిత్రాలను ఆదరిస్తూనే ఉంటారు. పెళ్లిచూపులు ఎంతటి హిట్ అయ్యిందో తెలిసిందే. మరి ఈసారి తరుణ్ భాస్కర్ ఇడుపు కాయితం పంచాయతీ తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తుందో లేదో చూడాలి.






