
మాజీ సీఎం కేసీఆర్(KCR)పై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు. కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందించారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట హరీశ్రావు ఉన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించగా.. 115వ సాక్షిగా కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు.
అన్ని అనుమతులు తీసుకొనే నిర్మించామన్న కేసీఆర్
విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఈక్రమంలో కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించగా.. క్యాబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని.. అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి అడగ్గా.. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని కేసీఆర్ బదులిచ్చారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు.
నేరుగా యశోదా ఆస్పత్రికి
కమిషన్ విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ నేరుగా యశోదా ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. ఆస్పత్రిలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కేసీఆర్ పరామర్శించనున్నారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేటలోని ఫాంహౌస్కు వెళ్లారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే జారి పడ్డారు. ఈ క్రమంలో ఆయన తుంటికి గాయమైంది. దీంతో హుటాహుటిన ఆయనను అంబులెన్స్లో హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.