
Mana Enadu : పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి (Sandhya Theatre Stampede) చెందగా.. ఆమె కుమారుడు ప్రాణాలతో ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. అయితే ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా ఈ ఘటనపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు.
సంక్రాంతి సినిమాలకు రేవంత్ షాక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటనతో టాలీవుడ్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. వచ్చేది సంక్రాంతి సీజన్.. ఈ పండుగ పూట బడా బడా హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పటికే సంక్రాంతి రేసులో దిగేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్ (Daku Maharaj)’, విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ చిత్రాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమాల నిర్మాతలకు షాక్ తగిలింది.
సీఎంను కలవనున్న టాలీవుడ్
ముఖ్యంగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి నిర్మాత అయిన దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల పెంపు (Ticket Price Hike Telangana) విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆ ఆలోచనకు బ్రేక్ వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
అమెరికా నుంచి ఇండియాకు దిల్ రాజు
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్న ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్రాజు (Dil Raju) ఇండియాకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలవడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నట్లు చెప్పారు.