బోర్డర్–గవాస్కర్ ట్రోపీ (Border-Gavaskar Trophy) ఫస్ట్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్తోపాటు.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 16 నెలల తర్వాత సెంచరీ చేశాడు. కంగారూ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తూ అతడు 143 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్లో 8 బౌండరీలతోపాటు 2 సిక్సులు ఉన్నాయి. విరాట్ సెంచరీ పూర్తికాగానే.. 487 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్తో కలిపి భారత్ మొత్తంగా 534 పరుగుల భారీ లీడ్లో ఉంది.
172 ఓవర్ నైట్ స్కోర్తో మూడోరోజు ఆట ప్రారంభించిన యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ అదే జోరు కొనసాగించారు. ఈ క్రమంలోనే జైస్వాల్ తన కెరీర్లో 4వ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మరో 16 పరుగులు జోడించి మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తాను నమోదు చేసిన మొదటి 4 సెంచరీలను కూడా 150 స్కోర్లుగా దాటించిన మొట్టమొదటి భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. రాహుల్ 77, పడిక్కల్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. కీపర్ పంత్, ధ్రువ్ జురెల్ రాణించలేదు. ఈ ఇద్దరూ చెరో పరుగు చేసి వెనుదిరిగారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 29, తెలుగు కుర్రాడు నితిశ్ కుమార్ రెడ్డి(38 నాటౌట్)తో కలిసి ఆడిన విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లో 30వ సెంచరీ నమోదు చేశాడు.
రికార్డ్ సెంచరీ
విరాట్ కెరీర్లో ఇది 81వ సెంచరీ. టెస్టుల్లో 30వ సెంచరీతో ఆస్ట్రేలియా గ్రేట్ బ్రాడ్మన్ (29 సెంచరీలు)ను (Bradman) కోహ్లీ అధిగమించాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో కోహ్లికి ఇది ఏడో సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్గా కోహ్లీ రికార్ట్ సృష్టించాడు.








