Warangal: అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్ ఈ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం..!

ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం.. ఇంటి పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. వరంగల్ మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుందని.. దీని కారణంగా ఆ ప్రాంతంలో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం బారిన పడతాని చెపుతున్నారు. ఇంత వరకూ భాగానే ఉన్నా.. ప్రజలకు సూచనలు చేస్తున్న అధికారులు.. సొంత కార్యాలయాన్ని మాత్రం గాలికి వదిలేశారు. వరంగల వైద్య ఆరోగ్య శాఖ కార్యాయాన్ని చూస్తే ఇది స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇటీవల కాలంలో వరంగల్ కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో రోగులపై ఎలుకలు దాడి చేయడంతో పరిశుభ్రత బాగోతం బయటకు వచ్చింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ప్రభుత్వం స్పందించి కమిటీని వేసింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా.. ప్రజల ఆరోగ్య బాగోగులు చూసే వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం శుభ్రత పాటించవలసిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

వరంగల్ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ చెత్తా చెదారం.. ముళ్ల కంపలతో పేరుకుపోయింది. నిత్యం కార్యాలయానికి ఏదో ఒక పనిపై వచ్చే సామాన్య ప్రజలకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. కార్యాలయం పరిసర ప్రాంతాల చుట్టూ ముళ్ళపొదలు. చెత్తాచెదారం నిండుకోవడంతో క్రిమి కీటకాలు, విష సర్పాలు కార్యాలయం లోపలికి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్, వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు. అయిన అధికారులకు తనిఖీ చేస్తారన్న భయం కూడా లేకుండా పోయింది.

వరంగల్ కేంద్రంలోని ఆటోనగర్, సెకండ్ డాక్టర్స్ కాలనీ, హనుమాన్ జంక్షన్ మధ్యలో ఓ కేనాల్‌ పక్కనే వైద్యశాఖ కార్యాలయం ఉంది. కార్యాలయం చుట్టూ వందలాది నివాస గృహాలు ఉన్నాయి. కనీసం మున్సిపల్ అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా కార్యాలయ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసినట్లయితే కార్యాలయం సమీపంలో ఉండే కాలనీ వాసులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెపుతున్నారు.

Share post:

లేటెస్ట్