
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Telangana Local Body Elections) ఎప్పుడు జరుగుతాయా అని ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు చెబుతూనే ఉన్నారు. కానీ ఈ వ్యవహారం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పునరుద్ఘాటించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. గురువారం రోజున సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన.. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
వ్యూహాత్మకంగా పని చేయాలి
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా పని చేయాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల మధ్య లోతుగా పంచుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు, వ్యవసాయానికి సహాయంగా ప్రభుత్వం రూ. 30 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. హుస్నాబాద్లో 250 పడకల హాస్పిటల్ను మంజూరు చేశామని, అర్హులైన ప్రజలకు ‘‘ఇందిరమ్మ ఇండ్లు’’ అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.