ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ (బుధవారం) విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని.. విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని వస్తారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.
ప్రధాని మోదీ రోడ్ షో
4:45 గంటలకు సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు ఈ ముగ్గురు డైనమిక్ లీడర్స్.. భారీ రోడ్ షో (PM Modi Road Show) నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది వస్తారని.. రోడ్ షోలో లక్ష మంది వరకూ పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర సర్కార్. దాదాపు 3వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు,విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్…
— Narendra Modi (@narendramodi) January 7, 2025
తెలుగులో ప్రధాని పోస్టు
విశాఖ, ఒడిశా పర్యటనలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ (PM Modi Telugu Post) చేశారు. “హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపనచేయడం చాలా సంతోషకరమైన విషయం.” అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ , తిరుపతి జిల్లాలోని చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగమైన కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతం ( KRIS సిటీ ) ల శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటాను .
— Narendra Modi (@narendramodi) January 7, 2025








