
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని కోహెడలో దొంగలు బీభత్సం సృష్టించారు. గొర్ల మందకు కాపలాగా ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసిన దుండగులు 30 గొర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కుషాయిగూడ ఠాణాలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నవీన్.. తండ్రి అనారోగ్యం కారణంగా ఆదివారం రోజున గొర్రెల మంద కాపలాకు వెళ్లాడు. అతడితో పాటు అతడి బావమరిది కూడా వెంట వెళ్లాడు. ఆదివారం రాత్రి గొర్రెల మంద కాపలా కాస్తూ అక్కడే నిద్రించారు. అయితే ముందస్తు ప్రకారం ఈ మందపై కన్నేసిన కొందరు దుండగులు గొర్రెలను ఎత్తుకెళ్లేందుకు పథకం రచించారు.
ఇందులో భాగంగా దుండగులు ఆదివారం రాత్రి వాహనాన్ని తీసుకువచ్చి చెట్ల పొదల్లో ఎవరికి కనిపించకుండా దాచారు. ఆ తర్వాత కాపలాగా ఉన్న నవీన్, అతడి వెంట వచ్చిన బావమరిది నిద్రపోయే వరకు వేచి ఉన్నారు. వారు నిద్రపోగానే వలలతో బంధించారు. మెలకువ వచ్చినవారు అరవగా అరిస్తే చంపేస్తామంటూ కత్తితో బెదిరించారు. ఈ క్రమంలో 60 వరకు గొర్రెలను వాహనంలోకి ఎక్కించి ఎత్తుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ నవీన్ మెడపై కత్తితో దాడి చేశారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ దాడిలో సుమారు పది మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నవీన్ ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం దండుగులు ఈ దొంగతనం చేశారని వెల్లడించారు.