ఈఎంఐలు, లోన్లు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్ల (Interest Rates)ను ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ఐదేళ్ల తర్వాత 6.25 శాతానికి రెపో రేటు
ఈ నిర్ణయంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ (Reserve Bank Of India) యథాతథంగా ఉంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈసారైనా తగ్గుతాయా అని ఎదురుచూసిన ప్రతిసారి నిరాశే ఎదురైంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరడంతో ప్రజలకు కాస్త ఊరట దక్కినట్లయింది. ఈ తగ్గింపుతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.






